(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జమ్ముకశ్మీర్ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో గతంలో హోంశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా ఉన్న ఇఎస్ఎల్ నరసింహంను అక్కడకు పంపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి గవర్నర్ సత్యపాల్ మాలిక్ను తెలంగాణకు మార్పు చేసి ఇక్కడ నుండి నరసింహన్ను అక్కడకు కేంద్రం పంపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కర్నాటకకు చెందిన సీనియర్ బిజెపి నేత డిహెచ్ శంకర్ మూర్తి పేరు కూడా గవర్నర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటలిజెన్స్ బ్యూరో అధిపతిగా పని చేసిన ఐపిఎస్ అధికారి నరసింహాన్ 2009నుండి ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చేశారు. 2014లో రాష్ట్రాన్ని విభజించిన తరవాత కూడా ఆయననే రెండు రాష్ట్రాలకూ గవర్నర్గా కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్కు గత నెలలో ఒదిషా రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిశ్వభూషన్ హరిచందన్ నియమితులు కావడంతో నరసింహన్ తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అయ్యారు.
నిఘా సంస్థల్లో పని చేసిన అనుభవంతో పాటు శాంతిభద్రతలు తదితర అంశాలపై నరసింహన్కు గట్టి పట్టు ఉండటంతో ప్రస్తుత తరుణంలో జమ్ము కశ్మీర్ గవర్నర్ పదవికి కేంద్రం ఆయన పేరును పరిశీలన చేస్తున్నదని సమాచారం.