(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో సాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో జరుగుతోన్న వాదనలు, పరిణామాలను ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది.
రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ విభజన జరగలేదని సొలిసిటర్ జనరల్ తెలంగాణ హైకోర్టుకు తెలపడం కొత్త చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్గా బదిలీ కాదని కేంద్ర ప్రభుత్వం వాదన వినిపించింది. ఆర్టీసీ రీఆర్గనైజేషన్కు తమ అనుమతి కోరలేదని పేర్కొంది. కేంద్రం వాదనతో ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వానికి ఇబ్బందులు రావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఏపీలో ఆర్టీసీ విలీనానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదని, ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని మంత్రి చెప్పారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని, ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనని.. విలీన ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు. విభజన జరగలేదన్న కేంద్రం…ఏపీ, తెలంగాణకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సులు నిధులు ఎలా కేటాయించిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ విభజన జరగకుండా ఏపీలో విలీనం ఎలా చేస్తారంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. ఏపీ ప్రభుత్వానికి సమస్యలు తప్పవు. అప్పుడు ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఏపీలో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయలేదని, ఉద్యోగులను మాత్రమే విలీనం చేస్తున్నారని.. కాబట్టి, పెద్ద వివాదం ఉండకచపోవచ్చని ఆర్టీసీ, అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా సరే దీనిపై ఓ సారి న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట.
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే అంశంపై కమిటీని నియమించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరిగితే 53,261 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరగనుంది. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందనున్నాయి.