న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు అర్ధరహితంగా శ్రమిస్తున్నారు అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈరోజు ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం విడుదల అయిన అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ బిజెపికి స్పష్టమైన మెజారిటీ కనబడడం ఈ ప్రశ్నకు కారణం. మహారాష్ట్రలో బిజెపితో అయిష్టమైన కాపురం చేస్తున్న శివసేన అదే ఎడిటోరియల్లో చంద్రబాబుకు శుభాకాంక్షలు కూడా చెప్పింది. చంద్రబాబు ఉత్సాహం ఈ నెల 23 వరకూ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
నిజానికి చంద్రబాబు ఉత్సాహం చాలామందిని ఆశ్చర్యపరుస్తూఉండొచ్చు. వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నిటి సగటూ తీస్తే బిజపికి సొంతంగా 302 సీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు కలిపి 122 సీట్లు వస్తున్నాయి. పైగా రెండు ఎగ్జిట్ పోల్స్ మినహా మిగతావన్నీ ఆంధ్రప్రదేశ్లో వైసిపికి స్పష్టమైన మెజారిటీ చెప్పాయి. టిడిపికి మెజారిటీ వస్తుందని చెప్పిన రెండు ఎగ్జిట్ పోల్స్లో ఒకటి లగడపాటి రాజగోపాల్ చేయించినది. కొద్ది నెలల క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయన చేయించిన సర్వే పూర్తిగా తారుమారు అయింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నిరుత్సాహపడతారేమో గానీ చంద్రబాబు నాయుడు కాదు. ఎగ్జిట్ పోల్స్ సరి కాదని నమ్ముతున్నారో లేక చివరివరకూ తన పని తాను చేసుకుపోవాలని అనుకుంటున్నారో గానీ ఆయన గట్టి ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ఢిల్లీలో శ్రమిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు ఎగ్జిట్ పోల్స్ రాగానే ఒక ఎదురుదెబ్బ తగిలింది. అంతకు ముందు చంద్రబాబు లక్నో వెళ్లి నచ్చజెప్పిన కారణంగా సోనియా గాంధీని కలిసేందుకు అంగీకరించిన బిఎస్పి నేత మాయావతి ఈరోజు ఢిల్లీ వెళ్లడం మానుకున్నారు.
చంద్రబాబు మాత్రం నిరుత్సాహపడడం లేదు. ఈరోజు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. నిన్న ఆయన రెండుసార్లు రాహుల్ గాంధీని, ఒకసారి సోనియాను కలిశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిపిఐ ప్రధాన కార్యదర్సి సురవరం సుధాకర రెడ్డి, జనతదళ్ నాయకుడు శరద్ యాదవ్లతో ఆయన ఇప్పటికే సమావేశమయ్యారు.