(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన తీరు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు చోటు ఇవ్వాలని ఆయన అన్నమాటలు పోలీసులకే ఎదురు తిరిగాయి. ఈ విషయాన్ని వదలకూడదని టిడిపి నిర్ణయించడంతో దాడి కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని డిజిపి నిర్ణయించారు.
అయితే ఈ సిట్ ఏర్పాటు సంగతి మీడియాకు చెప్పేందుకు దక్షిణ కోస్తా జోన్ ఐజి వినీత్ బ్రిజ్లాల్ ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు దర్యాప్తు ఎలా ఉండబోతుందో సూచించాయి. చంద్రబాబు పర్యటన ప్రారంభానికి అరగంట ముందు కొందరు నిరసన తెలపేందుకు వచ్చారనీ, వారిని అడ్డుకుంటే విషయం మరింత ముదురుతుందని నిరసనకు అవకాశం ఇచ్చామనీ బ్రిజ్లాల్ చెప్పారు.
నిరసనకారుల్లో ఒకరు రాయి, మరొకరు చెప్పు విసిరారనీ, బస్సు అద్దానికి అంతకుముందే పగుళ్లు ఉండడంతో రాయి దెబ్బకు అది పగిలిందనీ ఆయన పేర్కొన్నారు. బస్సు అద్దాలకు ముందే పగుళ్లు ఉన్నట్లు డ్రైవర్ కూడా అంగీకరించాడనీ తెలిపారు. టిడిపి నేతలు ఆరోపించినట్లు బస్సుపై పోలీసులు లాఠీ విసిరిన దాఖలాలు సిసి కెమెరా పుటేజీలో ఎక్కడా కనిపించలేదని చెప్పారు.
చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకముందే తామే సుమోటోగా రెండు కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
చెప్పు విసిరిన మందడం గ్రామానికి చెందిన బాస్కరరావు అలియాస్ బాపయ్య, రాయి విసిరిన ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన శృంగారపతి సందీప్పైనా కేసులు నమోదు చేసి వారిద్దరికీ అదే రోజు రాత్రి 11 గంటలకు నోటీసులు కూడా అందించామని చెప్పారు.
ఈ పర్యటనలోనే పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ ద్వారా చిత్రీకరించడంపై గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపైనా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ వ్యవహారాల్లో పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యం ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ఐజి బ్రిజ్లాల్ వెల్లడించారు.
నిరసనకు తామే అనుమతి ఇచ్చామనీ, రాయి, చెప్పు వేసిన వారిపై తామే సుమోటోగా కేసు నమోదు చేశామనీ, లాఠీ విసిరిన దాఖలాలు లేవనీ తదితర విషయాలు మొత్తం ఐజియే వివరించారు. ఇక సిట్ దర్యాప్తు చేసి కనుగొనే విషయాలు ఏమిటో మరి.