పొలిటికల్ మిర్రర్
డబ్భై ఏళ్ల వయసు…! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి… భవిష్యత్ పై బోలెడంత బెంగ… రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం… చుట్టూ తరుముకొస్తున్న కేసుల ఆందోళన ఒకవైపు…!
పార్టీని నిలబెట్టాలనే పట్టుదల, శ్రేణులను చైతన్యం చేయాలనే ఉద్దేశం, భవిష్యత్ పై ఏవేవో ఆశలు మరోవైపు…! ఇవన్నీ కూడగట్టుకొని బాబుగారు ప్రజాచైతన్య యాత్రలకు సిద్ధమవుతున్నారు. గతంలో ఉన్న మందీమార్బలం లేరు. నాడు ఉన్న నీడలూ లేవు. తుమ్మినా, దగ్గినా జారిపోయే ఎమ్మెల్యేలు, నాయకులూ మాత్రమే ఉన్నారు.
ప్రజా కాదు… కార్యకర్తల చైతన్య యాత్ర…!
తొమ్మిది నెలల కిందట సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టిడిపి ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీకి ప్రజా, జన, చైతన్య యాత్రలు కొత్త కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితుల దృష్ట్యా కొత్తదే. నాడున్న శ్రేణులు లేరు. ఉన్న శ్రేణుల్లోనూ ఉత్సాహం లేదు. పార్టీ అంటే ఉరకలేసే శ్రేణులకు కూడా దిశా నిర్దేశం చేసేందుకు సరైన నాయకత్వం లేదు. జగన్, వైసీపీ ఊపులో తొమ్మిది నెలల నుండి టీడీపి క్షేత్రంలో బాగా చతికిలబడింది. నిజానికి ఇప్పుడు బాబు చేయాల్సింది “ప్రజాచైతన్య”యాత్ర కాదు. “కార్యకర్తల చైతన్య” యాత్ర చేయాలి. తొమ్మిది నెలలు గడిచినా నాటి ఓటమి నుండి పూర్తిగా తేరుకొని శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం నూరిపోయాలి. వారు చైతన్యంతో ఉంటే యథాతథంగా పార్టీ చైతన్యం అవుతుంది. ఎన్నికలకు ఏడాదో, ఏడాదిన్నరో టైం చూసుకుని “ప్రజచైతన్య” యాత్రలు చేయొచ్చు. నిజానికి ఇది టిడిపి అంతర్గత ఆలోచన అయినప్పటికీ… అదే ఎలా చేయాలనేది కూడా బాబు అండ్ బృందానికి అంతుపట్టటం లేదు. ఓటమి సహజమే, రాజకీయాల్లో గెలుపోటములు కామన్… అని చెప్పాలన్నా… ఇది సాధారణ ఓటమి కాదు. ప్రశ్నించుకోవాల్సిన ఓటమి..! నేర్చుకోవాల్సిన ఓటమి…! భవిష్యత్ ని తయారు చేయాల్సిన ఓటమి…! ప్రత్యామ్నాయం చూపాల్సిన ఓటమి…! పార్టీలో బాబు తప్ప ఇంకెవ్వరూ పబ్లిక్ ఫిగర్ కాదు. లోకేష్, బాలకృష్ణ వంటివారు ఉన్నప్పటికీ వారిలో రాజకీయ పరిపక్వ హార్మోన్స్ లేవు. బాబు తర్వాత ఎవరూ? అనే ప్రశ్నకు శ్రేణుల్లో సమాధానం లేదు. ఏడు పదులు నిండి వయసులో … మైండ్ లో అలముకున్న చాదస్తంతో… ఊకదంపుడు ఊపన్యాసాలతో… అదే చంద్రబాబుని కార్యకర్తలు ఎన్నాళ్ళని చూస్తారు. అందుకే పార్టీకి తక్షణమే ఫైర్ కావాలి. ఫైర్ రగిలించగల నాయకత్వం కావాలి. అప్పుడే “చైతన్యం” సుసాధ్యం.
శ్రీనివాస్ మానెం