అమరావతి: అమరావతిపై వైసిపి రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంగళగిరి హాపీ రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానం పంపినా రాలేదని అన్నారు. రాజధాని నిర్మాణం ముందుకు పోకుండా ఉండేందుకు వైసిపి నాయకులు ఎన్నిచేయాలో అన్నీ చేశారని చంద్రబాబు విమర్శించారు. ‘భూములు ఇవ్వవద్దని రైతులను రెచ్చగొట్టారు. హరిత ట్రిబ్యునల్లో కేసు వేశారు. కోర్టులోనూ పిటిషన్లు వేశారు. అయినప్పటికీ రైతులు రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా 34వేల ఎకరాల భూములు ఇచ్చి సహకరించారు’ అని చంద్రబాబు తెలిపారు.
ప్రపంచ బ్యాంకుకు సైతం లేఖలు రాశారని చంద్రబాబు అన్నారు. రాజధానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. వారి చర్యల కారణంగా అమరావతి బ్రాండ్ నేమ్ దెబ్బతింటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వారి చర్యల కారణంగా రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి కోసం ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసునని చంద్రబాబు అన్నారు.
చంద్రయాన్ 2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. చంద్రయాన్కు కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయలు దండగ, అవినీతి అని జగన్ అంటారేమో అన్నారు చంద్రబాబు.