అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశ ప్రధానికి ఒక విధంగా, ముఖ్యమంత్రులకు మరొక విధంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తుఫాన్లు వస్తే ముఖ్యమంత్రి సమీక్షలు చేయొద్దా ? ప్రధాని మాత్రం ఏదైనా మాట్లాడవచ్చు, రాజకీయాలు చేయొచ్చా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి తాను లేఖ రాస్తే దానికి సమాధానం లేదని అన్నారు.
ఫొని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. సమీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రులు అందరూ ఎన్నికల సంఘాన్ని అడుక్కోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ నెల 23వ తేదీన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడే మోదికి అర్థం అయినట్లు ఉంది, అందుకే విపక్షాల ఉనికిని కూడా మోది సహించలేకపోతున్నారనీ చంద్రబాబు అన్నారు. ఆయనకు ఫ్రస్టేషన్ తారా స్థాయికి చేరినట్లు కనబడుతోందని చంద్రబాబు విమర్శించారు. ‘విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరని మోది అడుగుతున్నారు. మా విధానంపై మాకు క్లారిటీ ఉంది. ఎన్నికలు పూర్తి కాగానే కూర్చుంటాం. తదుపరి వ్యూహలను ఖరారు చేసుకుంటాం’ అని చంద్రబాబు అన్నారు. దేశంలో గతంలో బాధ్యతలు నిర్వహించిన అందరు ప్రధాన మంత్రులు హుందాగా వ్యవహరించారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇతర రాష్ట్రాలలోనూ ఇవిఎం సమస్యలు బయటపడ్డాయని చంద్రబాబు వివరించారు. పశ్చిమ బెంగాల్లో మరీ ఘోరంగా ఈవిఎంలు మొరాయించాయని చంద్రబాబు అన్నారు. చాలా దేశాలు పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నాయని మరో సారి చంద్రబాబు వివరించారు. 50శాతం వివి ప్యాట్లు లెక్కించాల్సిందేననీ అవసరమైతే మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చంద్రబాబు తెలిపారు. మళ్లీమళ్లీ చెబుతున్నా, వెయ్యి శాతం టిడిపి గెలుస్తుందని చంద్రబాబు ధీమాగా తెలియజేశారు.