(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఫైర్ అయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు నరసరావుపేట వర్యటనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం నుండి నరసరావుపేటకు ప్రారంభమైన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. యువకుల బైక్ తళాలను పోలీసులు తీసుకున్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో వాహనం దిగి వచ్చిన చంద్రబాబు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,
వైసిపి మంత్రులు,ఎమ్మెల్యేలు ర్యాలీ చేస్తుంటే అనుమతిస్తూ తన వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. డిజిపి గౌతమ్ సవాంగ్ చట్ట వ్యతిరేక చర్యలను విడనాడాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నేతల ప్రదర్శనలకు పోలీసులు దగ్గర ఉండి సహాయ సహాకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. వారికి మాత్రం 144, పోలీస్ యాక్ట్ 30ని వర్తింపజేయడం లేదని అన్నారు.పోలీసులు తీసుకున్న యువకుల బైక్ తాళాలను చంద్రబాబు తిరిగి వారికి ఇప్పించారు.
అనంతరం చంద్రబాబు పార్టీ శ్రేణులతో కలిసి నరసరావుపేట పర్యటనకు బయలుదేరి వెళ్లారు.