అమరావతి: కృష్ణానది కరకట్టపై గల అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన మకాం మార్చుకోవాలని యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన జగన్ ప్రభుత్వం చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని కూడా కూల్చివేయాలన్న ఆలోచన చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రజావేదిక ముందు నుండి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్డును కూడా ప్రభుత్వం తొలగించింది. ప్రజావేదిక కూల్చివేయడంతో పాటు తన నివాసానికి వెళ్లే రోడ్డును తొలగించడంపై చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని వైసిపి నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నుండి ఖాళీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్లు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. క్వాలిటీ ఐస్ క్రీమ్ గెస్ట్ హౌస్, నోవాటెల్ హోటల్ ప్రాంతంలో భారతినగర్లోని ఏడవ క్రాస్లో ఉన్న మరో గెస్ట్ హౌస్, కామినేని హాస్పిటల్ సమీపంలో ఉన్న గ్రానైట్ ఇండియా వారి గెస్ట్ హౌస్లను టిడిపి నేతలు పరిశీలించినట్లు సమాచారం. వీటిలో చంద్రబాబు మారేందుకు కామినేని ఆసుపత్రి సమీపంలో ఉన్న గ్రానైట్ ఇండియా గెస్ట్ హౌస్ భవనాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
previous post
next post