అమరావతి: రాజధాని కోసం ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో మీడియాపై దాడి చేశారన్న కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులను చంద్రబాబు సోమవారం పరామర్శించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రైతులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. రాత్రిపూట ఇళ్లకు వెళ్లి లాక్కొని రావడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిని ఇబ్బంది పెట్టడానికే అధికార పక్షనేతలు కుట్ర పన్నారని చంద్రబాబు విమర్శించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆరోపించారు. న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే ఇబ్బంది పెడతారా ? అని ధ్వజమెత్తారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడటం మంచిది కాదన్నారు. ఆరురుగు రైతులకు ఐదుకోట్ల మంది ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. తప్పుడు రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
అమరావతిని నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అవహేళన చేస్తారా? అని మండిపడ్డారు. ‘ రాజధానిని మార్చే అధికారం మీకు ఉందా? ఒక రాజధానికే డబ్బుల్లేవనే వాళ్లు.. మూడు రాజధానులు పెడతారా? రూ. 10 వేల కోట్లు ఖర్చుపెడితే ఏమీ పెట్టలేదని అసత్యాలు చెబుతారా? జీఎన్ రావు నివేదిక ఇవ్వకముందే అసెంబ్లీలో మూడు రాజధానులు వస్తాయని చెప్పారు. బీసీజీ నివేదికలో ఏం వస్తాయో మంత్రులు ముందే చెబుతున్నారు. రైతులను అవమానించే చర్యలు మంచిది కాదు’ అని చంద్రబాబు అన్నారు.
అన్ని పర్మిషన్లు తీసుకుని అమరావతికి వెళ్లిన తనపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. ఎన్నో కష్టాలు ఉన్న రైతులు నిరసన తెలుపుతుంటే వారిపై ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా రాజధాని కోసం చేసే ప్రజా ఉద్యమం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు సూచించారు.