అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెండర్ల విషయంలో గడ్కరీ ఎన్నో సార్లు వద్దు అని చెప్పారని.. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలన్న నవయుగ సంస్థ పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది.