అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. గత నాలుగు నెలల వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో కష్టపడుతున్నారని అందులో పేర్కొన్నారు. అనుభవరాహిత్యం, ఆశ్రత పక్షపాతంతో మీరు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమని లేఖలో చంద్రబాబు అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలో జరిగిన అవకతవకలు ఇందుకు ఒక ఉదాహరణ అని, దీనివల్ల ఏపీపీఎస్సీ ప్రతిష్టే దెబ్బతిన్నదన్నారు. వైసిపి వారి బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు ఎలా వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది, వారి బంధువులకే టాప్ ర్యాంకులు రావడం అవకతవకలకు నిదర్శనమన్నారు. ప్రశ్నపత్రం లీకైందనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ కంటే ముందే విశ్రాంత అధికారి, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఎలా చేరాయని నిలదీశారు.
లీకేజీతో దాదాపు 19 లక్షల మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిల్చిందని లేఖలో పేర్కొన్నారు. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణం పరీక్షలు రద్దుచేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని, అలాగే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలన్నారు. జగన్ రాజీనామా చేస్తారో లేక పంచాయతీ, విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.