అమరావతి: ఏపీలో సంక్రాంతి పండుగ వస్తే చాలు సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కోళ్ల పందాలు, ముగ్గుల పోటీలు, పిండివంటకాలు, రైతుల ఆనందం మధ్య సంబరాలు జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యుల మధ్య ఘనంగా జరుపుకునే టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు.. ఈసారి సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. సంక్రాంతికి ఎప్పుడూ సొంతూరు నారావారిపల్లెకు వెళ్లే చంద్రబాబు కుటుంబం ఈసారి వెళ్లడం లేదు. రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి, అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
సంక్రాంతి పండుగకు కుటుంబసభ్యులతో చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ దేవత సత్యమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. నాగప్రతిమకు పూజలు నిర్వహిస్తుంటారు. తల్లిదండ్రులు సమాధుల వద్ద నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి.. సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబాలు సందడి చేస్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి పండుగకు మాత్రం బాబు నారావారిపల్లెకు రావడం లేదు. కాగా, అమరావతి రైతల ఆందోళన నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలను కూడా చంద్రబాబు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద పండుగ అయిన సంక్రాంతి వేడుకలకు కూడా దూరంగా ఉంటున్నారు.