మచిలీపట్నం: రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టి బిక్షాటన చేశారు. రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు మచిలీపట్నంలో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. కోనేరు సెంటర్ వద్ద చంద్రబాబు స్వయంగా జోలెపట్టి కాలినడకన తిరుగుతూ ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఓ కండువా పట్టుకుని ప్రజల వద్దకు వెళ్లిన చంద్రబాబుకు.. ప్రజలు, వ్యాపారులు తమకు తోచినంత డబ్బులను ఆ జోలెలో వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.
అంతకు ముందు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. దారిలో మహిళలు, రైతులు వారికి స్వాగతం పలికారు. అమరావతినే రాజధానిగా ఎందుకు కొనసాగించాలో ప్రజలకు తెలిపేందుకు ఈ సభను అమరావతి జేఏసీ నిర్వహిస్తోంది.