(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం చంద్రబాబు కుటుంబం, నందమూరి కుటుంబ సభ్యులు రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళనలో ఉన్న రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేనని అన్నారు. ఈ ఏడాది మన అందరికి ఇది కష్టాల సంక్రాంతి అని వ్యాఖ్యానించారు.ప్రతి ఏటా నారా వారి పల్లె వెళ్లి మూడు రోజుల పాటు పండుగ చేసుకునే వాళ్లమనీ, కానీ ఈ సారి పండగ చేసుకోవడం లేదనీ తెలిపారు.
రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదనీ, అయిదు కోట్ల ఆంధ్రుల సమస్యగా చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కోసం 29 గ్రామాల రైతులు భూములను త్యాగం చేశారని అన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఇష్టానురీతిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సిఎం జగన్ ఓ మూర్ఖుడు అని దుయ్యబట్టారు. రాజధాని ఎక్కడ ఉండాలో శివరామకృష్ణ కమిటీ పరిశీలించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారనీ, భూములు ఇచ్చిన వారిలో వైసిపి కార్యకర్తలు కూడా ఉన్నారని అన్నారు. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదనీ, అభివృద్ధి కోరుకున్నారని చెప్పారు. రాయలసీమ ప్రాంత ప్రజలు విశాఖ వెళ్లాలంటే దూరా భారం అవుతుందని అన్నారు. అందరినీ బాధపెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వరదలు వస్తాయనీ, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్య ప్రచారాలు చేశారనీ మండిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక్కడ నిర్మించిన వన్నీ పర్మినెంట్ భవనాలేనని చంద్రబాబు అన్నారు. రాజధాని ఒకే సారి నిర్మించాలని చట్ట ప్రకారం సిఆర్డిఎ ఏర్పాటు చేసి నిర్మాణాలు మొదలు పెట్టామని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళని అన్నారు. అమరావతిని చంపేసి ఒక కన్ను పోగొట్టారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పనులు కూడా ఆపేసి రెండో కన్ను కుడా చంపేసేలా ఉన్నారని అన్నారు.
అమరావతి కంటే ముందుగా కీయా మోటార్స్ తీసుకువచ్చామని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెదాలనేది తన ఆకాంక్ష అని వెల్లడించారు.రాజధాని అమరావతిలో తాను కట్టిన ఏసి రూముల్లో ఉంటూ అసలు నిర్మాణాల జరగలేదని వైసిపి నేతలు అంటున్నారని మండిపడ్డారు. రాజధానిలో రైతు కూలీలకు పెన్షన్లు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి గోడు పట్టించుకోకుండా సిఎం ఎడ్ల పందాలకు వెళ్లారని దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఉగ్రవాదులా, తీవ్ర వాదులా ఇక్కడ 144 సెక్షన్ ఎందుకు పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుందన్నారు. మంచి కోసం పోరాడుతుంటే వాళ్లు నష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జగన్కు జ్ఞానోదయం కావాలన్నారు. జగన్ వల్ల అయిదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అంధకారంలో పడిందనీ, ఎప్పుడూ లేనట్లుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేసే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రభుత్వం సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని రైతులు చంద్రబాబుకు తెలియజేయగా ఏకపక్షంగా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదని చంద్రబాబు పేర్కొన్నారు.