అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా అడిగితే మూడు పేర్లు చెప్పే పరిస్థితి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉన్నాయంటే మనం అవమానంగా భావించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.ఏపీ రాజధాని ఏది అంటే ఏ పేరుతో మొదలు పెట్టాలి..ఏ పేరుతో ముగించాలని ఆయన ప్రశ్నించారు. నాడు అందరికి సమానమైన దూరంలో ఉంటుందనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా ఏంపిక చేశామని చంద్రబాబు అన్నారు.
చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రాజధానిని మార్చిన సందర్భం ఎప్పుడూ లేదని, అప్పట్లో తుగ్లక్ ఒక్కడే రాజధానిని మార్చారని చంద్రబాబు గుర్తు చేశారు. వితండవాదంతో జగన్ కమిటీల మీద కమిటీలు వేశారని అన్నారు.రాజధాని అంటే యువత కలలకు వేదికగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.
పనుల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందనీ. అలాంటి నగరాన్ని మనం నిర్మించుకోవాలని సంకల్పించి అమరావతిని ఎంపిక చేశామన్నారు. ఒక్క పిలుపుతో అమరావతి రైతులు త్యాగం చేసి భూములిచ్చారని చంద్రబాబు కొనియాడారు.
సింగపూర్లాంటి సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పామనీ, భూములకు విలువ పెరుగుతుందని రైతులు భూములు ఇచ్చారనీ చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఇప్పటి వరకూ దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు. అమరావతిలో ప్రస్తుతం ఉన్న పది వేల ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులతో రాజధాని అభివృద్ధి చేయవచ్చునని చంద్రబాబు అన్నారు.
ప్రస్తుతం జగన్మోహనరెడ్డి చర్యల వల్ల పలు జిల్లాల వారు అటు తమిళనాడు, కర్నాటకలో కలపాలని కోరుతున్నారని అన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే సిఎం జగన్కు తెలియదని చంద్రబాబు విమర్శించారు. ఇన్ని సంవత్సరాల తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి సిఎంను చూడలేదని అన్నారు. రాజధాని అనేది అయిదు కోట్ల మంది ప్రజల సమస్య అన్నారు. సిఎం, మంత్రులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులు ఒకే చోట ఉండాలనీ, అప్పుడే పరిపాలన సజావుగా సాగుతుందనీ అన్నారు. ఒక్కొక్కరూ ఒక్కోచోట ఉంటే పనులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజధానిలో కేవలం మూడు, నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం భవనాలు పూర్తి అవుతాయని చంద్రబాబు చెప్పారు.