అమరావతి, ఏప్రిల్ 12: ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోది, జగన్, కెసిఆర్లు కలిసి ఎన్ని రకాలుగా కుట్రలో చేయాలో అన్ని చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 4583 ఇవిఎంలు పని చేయకపోవడం వల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ, అర్థరాత్రి వరకూ పలు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. చివరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సైతం కేంద్రానికి మొదటి సారి వెళ్లినప్పుడే ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని చంద్రబాబు గుర్తు చేశారు.
నిన్న జరిగిన సంఘటనతో ఇవిఎంలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈవిఎంల కారణంగా ప్రజలు ఇంత ఇబ్బందులు పడితే వైసిపి ఒక్క మాట కూడా మాట్లాడలేదనీ, ఎన్నికల కమిషన్ వారికి సహకరిస్తుండటం వల్లనే వైసిపి మాట్లాడలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు.
ఈవిఎంలపై నమ్మకం లేకనే 22 రాజకీయ పార్టీలతో కలిసి కోర్టును ఆశ్రయించామన్నారు. 50శాతం వివిప్యాట్లను లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఎన్నికల కమిషన్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి నియోజకవర్గానికి కేవలం ఐదు వివిప్యాట్లు లెక్కించడానికి అంగీకరించిందని చంద్రబాబు అన్నారు. ఈవిఎంలకు సంబంధించి సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఆలోచన చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్లు వారి స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చంద్రబాబు విమర్శించారు.
ఈసి తీరు ఇంత అధ్వాన్నంగా ఉండటాన్ని తానెప్పడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక్కడ ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ బీహారీ సంస్కృతిని తీసుకువచ్చారని చంద్రబాబు విమర్శించారు. వారు ఎన్ని రకాలుగా దాడులకు పాల్పడినా ఆందోళనలు సృష్టించినా జన్మభూమిని కాపాడుకోవాలన్న తపనతో ఓటర్లు భయపడకుంటా ఓటు హక్కు వినియోగించుకున్నారని చంద్రబాబు అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలలోపే పెద్ద సంఖ్యలో బారులు తీరడం తనకే ఆశ్చర్యాన్ని కల్గించిందని చంద్రబాబు అన్నారు. ఆళ్లగడ్డలో టిడిపి కార్యకర్తను దారణంగా హత్య చేయడం, మాగంటి రూప, భూమా మౌనిక కార్లపై రాళ్లతో దాడి చేయడం, కోడెల శివప్రసాద్పై దాడి చేయడం, ఇలా అనేక ప్రాంతాల్లో భయంకరణ వాతావరణాన్ని సృష్టించారని చంద్రబాబు అరోపించారు. చివరకు ప్రశాంతంగా ఉండే విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో కూడా ఘర్షణలను సృష్టించారని చంద్రబాబు విమర్శించారు.
ఎన్నికల కమిషన్ తన ఇష్టానుసారంగా ఇంటెలిజెన్స్ డిజితో సహా ఎస్పిలను ఇతర అధికారులను బదిలీ చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఎస్పి చేసిన తప్పేమిటి, ఆయన్ను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. పని చేసే వ్యక్తులను మారిస్తే వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చంద్రబాబు అన్నారు. నేరస్తులను కాపాడటానికే బదిలీలు చేశారని చంద్రబాబు విమర్శించారు.
సిబిఐ, ఆర్బిఐ, ఈడి, ఐటి లాంటి సంస్థలతో పాటు నేడు ఎన్నికల కమిషన్ను భ్రష్టుపట్టించే పరిస్థితికి మోది తీసుకువచ్చారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ఏకపక్షంగా టిడిపి అభ్యర్థులు, నాయకులపై ఐటి దాడులు చేయించారని అన్నారు.
నేరస్తుడు (ఎ2) చెప్పితే ఎన్నికల కమిషన్ పని చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. రేపు ఢిల్లీకి వెళ్లి ఈ ఘటనలపై కేంద్రం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్థానని చంద్రబాబు తెలిపారు. నా ఓటు నాకు పడిందో లేదో తెలుసుకునే పరిస్థితి లేదన్నారు. తాను అడిగే ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పితీరాలని చంద్రబాబు అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోది, అమిత్షాల నియంతృత్వ చర్యలను అడ్డుకుని తీరతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్నికల్లో టిడిపి ఎన్ని సీట్లు వస్తాయో రేపు ఫలితాల్లో మీరే చూస్తారు అంటూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.