అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం టీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మండలి రద్దు చేస్తామనడం మరో ఉన్మాద చర్య అని అన్నారు. రద్దు తీర్మానం చేయకుండా అసెంబ్లీలో చర్చ జరపడం..రాజ్యాంగ విరుద్దమన్నారు. 1984 ఆగస్ట్ సంక్షోభం తనతో సహా అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలను హీరోలను చేసిందని, అప్పటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అందరికీ స్ఫూర్తి అని అన్నారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలుగా నిలబడ్డారన్నారు. కౌన్సిల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మరో స్ఫూర్తి అని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలయ్యారన్నారు. పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు చరిత్ర హీనులు అయ్యారని ఆయన మండిపడ్డారు. టీడీపీ చరిత్రాత్మక పోరాటంతో వైసీపీ దిమ్మ తిరిగిందని…అక్కసుతోనే టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రలోభాలను అధిగమించి, బెదిరింపులను ధీటుగా ఎదుర్కొని టిడిపి ఎమ్మెల్సీలు హీరోలు అయ్యారని చెప్పారు. పాలాభిషేకాలు ప్రజల్లో పెరిగిన ప్రతిష్టకు నిదర్శనాలు అని పేర్కొన్నారు.
రాజధాని అంశం సెలెక్ట్ కమిటీ, హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కౌన్సిల్ ఛైర్మన్ ని అసెంబ్లీలో తప్పుపట్టడం ఎక్కడైనా జరిగిందా ? అని నిలదీశారు. మండలి రద్దుపై భయపడేది లేదని.. సీఎం బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. చట్టాలను తుంగలో తొక్కుతారా అంటూ మండిపడ్డారు. మెజార్టీ ఉందని తలకు రోకలి చుట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు. సెలెక్ట్ కమిటీకి పంపాక ఆఫీసుల తరలింపు తగదన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపింది ప్రజాభిప్రాయం కోసమే అని ప్రజాభిప్రాయం తీసుకుంటామని అనడం కౌన్సిల్ నేరమా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. కౌన్సిల్ రద్దు చేస్తే చరిత్ర హీనులుగా మిగుల్తారని హెచ్చరించారు. దురుద్దేశాలతోనే కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీలో సీఎం జగన్ చర్చ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.