(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనంతపురం: రాజధాని అమరావతి మార్చాలనుకుంటే వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనీ, ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోవచ్చనీ, తాను రాజకీయాలు వదిలేస్తాననీ టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ ప్రతిపాదనకు సిఎం ఎలాగూ ఒప్పుకోరనీ, కావున రాజధానిపై ఓటింగ్ నిర్వహించి అమరావతా, విశాఖ అన్నది తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పెనుగొండలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతే అని అన్నారు. టిడిపి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు ప్రజలంతా ఒప్పుకున్నారని చెప్పారు.
అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పింది తానేనన్నారు. ఇప్పుడు హైకోర్టును కూడా మూడు ముక్కలు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమ నుండి విశాఖకు వెళ్లాలంటే రాత్రంతా ప్రయాణించాలన్నారు. అక్కడకి వెళ్లేందుకు రెండు రోజులు, వచ్చేందుకు రెండు రోజులు పడుతుందని పేర్కొన్నారు.
ఏపికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి బాధపడ్డారని తెలుపుతూ ఏపిలో మూడు రాజధానుల ప్రతిపాదనతో తమకే లాభమని తెలంగాణకు చెందిన ఒక మంత్రి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.