అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించిన వెంటనే చంద్రబాబు పదవీ కాలం ముగుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం హన్స్ ఇండియా పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎల్ వి సుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సాంకేతికంగా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. ఆయన ముఖ్యమంత్రే. కానీ, అధికారాలు ఉండవు. మే 23న టిడిపి గెలిస్తే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు. అది మే 24 కావొచ్చు. లేకపోతే ఆయనకు మంచిదనిపించిన రోజు కావొచ్చు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారికి అప్పుడు రాష్ట్ర పరిపాలన యంత్రాంగం సహకరిస్తుంది’ అని ఎల్వి సుబ్రమణ్యం పేర్కొన్నారు.
చంద్రబాబు 2014 జూన్ ఎనిమిదిన ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి, ఐదేళ్ల కాలం (2019 జూన్ 8) వరకు పదవిలో ఉంటారని టిడిపి నేతలు వాదిస్తున్నారు. దీనిపై కూడా ఎల్వి సుబ్రమణ్యం వివరణ ఇచ్చారు. ‘ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన అసెంబ్లీ పదవీ కాలం ఐదేళ్లు అనే నిబంధన ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చు అనటానికి నిబంధనలు లేవు’ అని పేర్కొన్నారు.
ఒక వేళ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లాంటిది ఏర్పడితే, అప్పుడు ఏం చేయాలని ప్రశ్నించగా.. ‘అప్పుడు కూడా ముఖ్యమంత్రి తటస్తంగా ఉంటారు. ఎన్నికల నియమావళి లోని నిబంధనలకు లోబడి ముఖ్యమంత్రి అధికారులకు మార్గనిర్దేశం చేయవచ్చు.’ అని చెప్పారు.
ఏప్రిల్ ఆరు తర్వాత నుంచి ఇప్పటి వరకు చంద్రబాబునాయుడు తనను ఎలాంటి సమీక్షలకు పిలవలేదని సుబ్రమణ్యం తెలిపారు. నియమ నిబంధనలకు లోబడే కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కలిసి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. కొందరు కలెక్టర్లు సహకరించడం లేదన్న వాదన రావడంతో ఒక చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో కలసి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. టిడిపి నేతలు కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎల్ వి సుబ్రమణ్యం అన్నారు..
టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వకుండా సిఎస్ అడ్డుకుంటున్నారంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలను ఎల్ సుబ్రమణ్యం ఖండించారు. సంక్షేమ పథకాలకు నిధులు ఆపేయాలని తాను ఆర్థిక శాఖకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. యనమలకు ఏమైనా సందేహాలు ఉంటే, తనను కలవచ్చని చెప్పారు.