అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసి తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమనీ, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తొమ్మిది పేజీల లేఖను రాశారు.
‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికలప్పుడు ఇలాంటి ఘటనలు చూడలేదు. తెదేపా చేసిన ఏ ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. కానీ, వైసిపి చేసిన ఫిర్యాదులపై వెంటవెంటనే నిర్ణయాలు అమలయ్యాయి. ఫిర్యాదులు చేసిన టిడిపి నేతలను ఐటీ దాడులతో భయపెట్టారు. ఆధారాలు లేని కేసులతో వారిని ఇబ్బందులు పెట్టారు’ అని చంద్రబాబు అరోపించారు.
సాధారణ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రజలకు సంబంధించిన కీలక అంశాల్లో వ్యాఖ్యలు చేయడం సిఇఒకు తగదని అన్నారు. సిఎంకు అధికార పరిధిలేదంటూ సిఇఒ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నివేదికలను అదనపు డీజీ నేరుగా సీఎంకు నివేదించవద్దంటూ ఆదేశించడం తగదని చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో తాగునీరు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నాననీ, సమీక్షలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునేలా ఆంక్షలు పెట్టవద్దని తన లేఖలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
సిఇసికి చంద్రబాబు రాసిన లేఖ ఇదే.