న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బుధవారం చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక ఈ కేసులో తనను జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను..ఈ నెల 5న ఢిల్లీలోని ట్రయల్ కోర్టు సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూలమే చిదంబరం అరెస్టుకు దారి తీసింది. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ద్వారా నిధుల్ని మళ్లించేందుకు బదులుగా తన కుమారుడు కార్తీ చిదంబరానికి సహాయం చేయాలని చిదంబరం తనను, తన భర్త పీటర్ ముఖర్జియాను కోరినట్టు ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఆగస్టు 21న అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా స్కాంలో ఇంద్రాణీ, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ సహ నిందితులు. ఆ మీడియా సంస్థ స్థాపకులు కూడా వీరే. చిదంబరం కుమారుడు కార్తి, పీటర్ కు వ్యాపార సలహాదారుడు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండడం, కార్తి తమకు సలహాదారుడు కావడంతో ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణీ చక్రం తిప్పింది. ఐఎన్ఎక్స్లో 26 శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరుతూ ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేసింది.
కానీ ఆమె దరఖాస్తును ఎఫ్ఐపీబీ తిరస్కరించింది. చిదంబరం కూడా రూ 4.62 కోట్లరూపాయల వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఈ సమయంలో కార్తితో ఇంద్రాణీ వ్యవహారం నడిపించేందుకు స్కెచ్ వేసింది. దీంతో కార్తి ఆమెతో బేరానికి దిగాడు. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఆమె డీల్ ఓకే చేయిస్తాననడంతో ఇంద్రాణీ, పీటర్ ఒప్పుకున్నారు. దీంతో మనీ లాండరింగ్ ద్వారా దాదాపు రూ. 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. తర్వాత కార్తిని, ఇంద్రాణీ ఓ స్టార్ హోటల్లో కలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 10 లక్షల డాలర్ల చెల్లింపులకు చర్చలు జరగ్గా రూ 3.5 కోట్ల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో అరెస్టయ్యాక ఇంద్రాణీ అప్రూవర్గా మారి ఈ వివరాలన్నింటినీ బయట పెట్టేయడంతో చిదంబరంతోపాటు ఆయన కుమారుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.