న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 19 వరకూ చిదంబరం ఆ జైల్లోనే ఉండనున్నారు. గత 15 రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరంను గురువారం కోర్టులో హాజరపరిచారు. చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. అయితే, తీహార్ జైలులో చిదంబరంకు ప్రత్యేక గదితోపాటు కొన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన తరుపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. దీనికి కోర్టు అనుమతిచ్చింది.
ఐఎన్ఎక్స్ ముడపుల కేసులో ఆగస్టు 21న సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. సీబీఐ కస్టడీలో 15 రోజుల పాటు ఉన్న చిదంబరం…ఇన్ని రోజులు సీబీఐ కార్యాలయంలో ఉన్నారు. ఇక సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టు.. ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దాంతో చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఆర్ధికమంత్రిగా ఉన్న చిదంబరం రూ.305 కోట్లను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అక్రమంగా తరలించారని ఆరోపణలు చేస్తూ ఈడీ కేసు నమోదు చేసింది.
అంతకు ముందు.. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. మరోవైపు ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట లభించింది. ఆయనతో పాటు కుమారుడు కార్తీకి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన సమయంలో… ఎయిర్సెల్ మాక్సిస్లో నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు.. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేలా చిదంబరం ప్రభావితం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిపింది.