ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస అఘాడీ’ ప్రభుత్వం నెగ్గింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. బలపరీక్షకు ముందే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండానే ప్రొటెం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145..కాగా, ఉద్ధవ్ ఠాక్రేకు 169 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు.
అంతకు ముందు.. విశ్వాస పరీక్షను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చవాన్ తీర్మానం ప్రతిపాదించగా, తర్వాత ఎన్సీపీ ఎమ్మెల్యే నవాబ్ మాలిక్, శివసేన ఎమ్మెల్యే సునిల్ చదివి వినిపించారు. అయితే ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని మాజీ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ నియామకం అనైతికంగా జరిగిందన్నారు. దీంతో బీజేపీ సభ్యులు లేకుండానే విశ్వాసపరీక్ష జరిగింది. బల పరీక్ష సమయంలో నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఆదివారం స్పీకర్ ఎన్నికతోపాటు ఉభయసభులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కాగా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.