బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న ‘కరోనా వైరస్’కు ‘సార్స్’కు దగ్గర పోలికలు ఉన్నట్టు వైద్య గుర్తించారు. ప్రపంచ దేశాలను వణిస్తున్న ‘కరోనా వైరస్’ చైనాలో 56 మందిని పొట్టనపెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు వేల మంది ఈ వైరస్ బాధితులు ఉన్నారని ఆదివారం ప్రకటించారు. వైరస్ కారణంగా చైనీయులు నూతన సంవత్సర వేడులకు దూరంగా ఉన్నారు. జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం తాజాగా పదిహేను మంది మరణించారు. 688 కొత్త కరోనావైరస్ కేసులు నిర్ధారించబడ్డాయి. హుబేలో 13 మంది, షాంఘైలో ఒకరు మరణించినట్లు తెలిపారు. మనిషి నుంచి మరో మనిషికి.. ఓ నగరం నుంచి మరో నగరానికి ఈ వైరస్ విస్తరిస్తోంది. గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే వైరస్ శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన మొత్తం 56 మందిలో అసాధారణ రీతిలో న్యుమోనియా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.
కరోనా వైరస్ ప్రభావం దేశంలో తీవ్రంగా ఉన్నదని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు. వ్యాధిగ్రస్తుల్లో 323 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం తెలిపింది. రాజధాని బీజింగ్ సహా దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నట్టు పేర్కొంది. కరోనా వైరస్కు కేంద్రంగా ఉన్న వుహాన్ నగరం నుంచి ప్రయాణిస్తున్న వారే వ్యాధి బారిన పడుతున్నట్టు తెలిపింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికి 56 మంది మృత్యువాత పడగా, వీరిలో 52 మంది హుబెయి ప్రావిన్స్కు చెందినవారే ఉన్నారు.
చైనాలోని మొత్తం పది నగరాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. అంతేకాదు, చైనా గ్రేట్ వాల్ను సైతం మూసివేశారు. లూనార్ క్యాలెండర్ ప్రకారం చైనా కొత్త సంవత్సరం జనవరి 25 కాగా, ఇందుకు వారం రోజులు సెలవులు ఇస్తారు. అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకలను చైనీయులు జరుపుకుంటారు. కానీ, ఈసారి కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలను రద్దుచేశారు. కరోనా వైరస్కు సార్స్కు దగ్గర పోలికలు ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ మూలాలను గుర్తించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ జంతువుల నుంచి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కరోనా వల్ల చనిపోయిన 56 మందిలో అధిక శాతం మంది సముద్ర ఆహార మార్కెట్లో పనిచేసినవారే కావడం గమనార్హం. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి వుహాన్ చేపల మార్కెట్లోనే పనిచేశాడు.
కరోనా వైరస్ చైనాలోనే కాకుండా హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, వియత్నాం, అమెరికా వరకు విస్తరించింది. వైరస్ బారిన పడిన బాధితుల కోసం ఇప్పటికే ఒక కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించిన చైనా..దాన్ని పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తమ్ములు, గాలి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున మంచి క్వాలిటీ మాస్క్లు వాడాలని సూచించింది. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని హెచ్చరించింది.