బీజింగ్: చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకూ నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25కి చేరింది. మరో 830 మంది ఈ వ్యాధి బాధితులుగా మారినట్లు చైనా ప్రభుత్వ అధికారులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో 177 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ కొరియా, జపాన్ లో మరో రెండు కేసులు నమోదైనట్లు శుక్రవారం ధృవీకరించింది. వైరస్ ను మొదటిసారి గుర్తించిన వుహాన్ నగరంలో మరో వెయ్యి మంది అనుమానితులకు పరీక్షలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. చైనాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితిగా మాత్రం పరిగణించలేదు.
వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం భద్రతా చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే వుహాన్ నగరంలో ప్రజారవాణాను నిలిపివేశారు. పలు నగరాల్లో రాకపోకలు, సాధారణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. దీంతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్, హుయాంగ్ గాంగ్, ఖియాన్ జింగ్ తదితర నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. శ్వాస వ్యవస్థపై ‘కరోనా వైరస్’ తీవ్ర ప్రభావం చూపుతుంది. గురువారం(జనవరి 23) నుంచి వుహాన్ నగరంలో ప్రజా రవాణా సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాన్ని మూసివేశారు. వుహాన్ నగర వాసులు తప్పనిసరై ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కులు కచ్చితంగా ధరించాలని అధికారులు సూచించారు.
మరోవైపు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాలో ప్రవాస భారతీయుల భద్రతకు బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటోంది. డబ్యూహెచ్ఓ జారీ చేసిన హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటోంది. చైనాలో వచ్చిన కరోనా వైరస్పై ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్కి మందు లేకపోవడంతో దీన్ని అడ్డుకోలేకపోతున్నారు. చైనాలో మొదలై, జపాన్, అమెరికా ఇలా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి సోకిన కేసులు బయటపడుతుంటే… ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం..చైనాలో 830 మందికి ఈ వ్యాధి సోకింది. తైవాన్ లో ఒకటి, మకావో, హాంకాంగ్, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియాలో రెండు కేసులు నమోదు అయ్యాయి. థాయ్ లాండ్ లో ముగ్గురికి సోకింది. సింగపూర్, అమెరికాలో ఒక్కొక్కరికీ వచ్చింది. దీంతో ఈ వైరస్ ప్రజలను కలవరపెడుతోంది.