బీజింగ్: చైనాను ప్రాణాంతకర ‘కరోనా వైరస్’ వణికిస్తోంది. ఈ వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే వందలాది మందికి సోకి, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘైతోపాటు చైనాలోని ఇతర ప్రావిన్సులలో 220 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఆస్ట్రేలియాలో అనుమానాస్పద కేసుతో సహా ఐదు కేసులు విదేశాలలో నమోదయ్యాయి. జపాన్లో ఒక వ్యక్తి, థాయ్లాండ్లో మరో ఇద్దరు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. హాంకాంగ్ నుండి 106 అనుమానాస్పద కేసులు నమోదయ్యాయని నగర అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. “అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి” గా ప్రకటించింది.
కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు చైనాలో నలుగురు మృతి చెందారు. ఈ నెలలో దేశవ్యాప్తంగా ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. శ్వాసకోశ సంబంధ వ్యాధులకు మూలకారణమైన ఈ వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో డిసెంబర్ నెలలో వెలుగుచూసింది. అందుకే వుహాన్ నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు సింగపూర్, హాంగ్కాంగ్ దేశాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అమెరికా కూడా తమ ప్రధాన విమానాశ్రయాల్లో ఇదే తరహా టెస్టులు చేయాలని ప్రకటించింది. మొదట్లో వైరస్ గురించి భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు చెప్పినప్పటికీ, వారంరోజుల నుంచి ఎదురవుతున్న పరిస్థితి, సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించడం లేదని, జంతువుల నుంచి మనుషులకు సోకుతోందని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. మనిషి నుంచి మనిషికి సోకుతుందా లేదా అన్నదానిపైనా పరిశోధనలు చేస్తున్నారు. వైరస్ సోకిన రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి లేబరేటరీల్లో పరిశీలిస్తున్నారు.
వుహాన్ నుంచి విమానంలో దిగిన చైనా మహిళను దక్షిణ కొరియా సియోల్లో సోమవారం కరోనావైరస్ తో ఆసుపత్రిలో చేర్చారు. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఈ పరిస్థితిని గమనించి, కొత్త కరోనావైరస్ వల్ల వచ్చే న్యుమోనియా వ్యాప్తిని దేశం అరికడుతుందని సోమవారం చెప్పారు.