లక్నో: లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై బీజేపీ వేటు వేసింది. ఆయనను బీజేపీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్సవ తెలిపారు. చిన్మయానంద్ బీజేపీకి చెందిన నేత కాదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని శ్రీవాత్సవ పేర్కొన్నారు. చిన్మయానంద్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఎప్పుడో రద్దు చేశామన్నారు. అయితే దానికి సంబంధించిన కచ్చితమైన తేదీని చెప్పలేం కానీ, ఇకపై ఆయన ఎంతమాత్రం బీజేపీ సభ్యుడు కాదని స్పష్టం చేశారు. చిన్మయానంద్ పై ఆరోపణలు వచ్చిన నెల రోజుల తర్వాత ఇవాళ బీజేపీ నుంచి అధికారికంగా ఈ ప్రకటన వచ్చింది.
ఇదిఇలా ఉంటే..ఇటీవల చిన్మయానంద్ ను సాధువుల కమిటి నుంచి తొలగించాలని అఖిల భారతీయ అఖాడ పరిషత్(ఏబీఏపీ) కూడా నిర్ణయించింది. ఇక మీదట చిన్మయానంద్ తన పేరు పక్కన స్వామి అని కానీ, సంత్ అని కానీ పెట్టుకోవడానికి వీలు లేదని ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నిర్ణయాన్ని అక్టోబర్ 10న వెల్లడిస్తామని నరేంద్ర గిరి పేర్కొన్న సంగతి తెలిసిందే.
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వంలో చిన్మయానంద్ కేంద్రమంత్రిగా పని చేశారు. మూడు సార్లు బీజేపీ ఎంపీగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన 23 ఏళ్ల లా స్టూడెంట్.. చిన్మయానంద్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షాహజన్పూర్లో లా కాలేజీలో అడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆగస్టు 24న ఫేస్ బుక్లో పోస్టు చేయడం సంచలనం సృష్టించింది. కాలేజ్ హాస్టల్ లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. ఏడాదిపాటు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో సెప్టెంబర్ 20న చిన్మయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చిన్మయానంద ఒప్పుకున్నారని గత వారం ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ నవీన్ అరోరా తెలిపారు. బాధితురాలిని లైంగికంగా వేధించినట్లు, నగ్నంగా ఉన్న తనకు మసాజ్ చేయాల్సిందిగా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు ఒప్పుకొన్నారని తెలిపారు. విచారణలో భాగంగా చిన్మయానంద్ తన నేరాన్ని అంగీకరించారని, తాను చేసిన పనులకు ఇప్పటికే సిగ్గుపడుతున్నానని, ఇక వాటి గురించి ఇంకా ఏం చెప్పలేనంటూ ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయినట్లు తెలిపారు.
మరోవైపు చిన్మయానంద్ ను డబ్బుల కోసం బెదిరించిన కేసులో న్యాయ విద్యార్థినిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.