ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించిన ‘మై భీ చౌకీదార్’ కాంపెయిన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విమర్శలు సైతం ఎదుర్కొంటుంది. సమాజానికి చెందిన అన్ని వర్గాలకు కాపలాదారుడిగా వ్యవహరించడంలో మోది విఫలమయ్యారని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఆ కొందరిలో ఫాతిమా నఫీస్ కూడా ఒకరు. మూడేళ్ళ క్రితం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యు) లోని తన హాస్టల్ రూమ్ నుండి అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైన నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా.
‘చౌకీదార్’ అని నరేంద్ర మోది ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఫాతిమా ఆయనపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.
‘మీరు కాపలాదారుడే అయితే నా కొడుకు ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఇప్పటివరకూ ఏబివిపి కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? దేశంలోని మూడు అత్యున్నత దర్యాప్తు సంస్థలు నా కొడుకు ఆచూకీ కనిపెట్టటంలో ఎందుకు విఫలం అయ్యాయి’ అని ఫాతిమా ట్వీట్ చేశారు. ట్వీట్ కు #WhereIsNajeeb అనే హ్యాష్ టాగ్ ను జత చేశారు.
27 ఏళ్ల నజీబ్ అహ్మద్ బయోటెక్నాలజీ విద్యార్థి. నజీబ్ 2016 అక్టోబర్ 16 న ఏబివిపి విద్యార్థులతో ఘర్షణ అనంతరం మహీ-మాండ్వి హాస్టల్ నుండి కనిపించకుండా పోయాడు. అదృశ్యంపై పోలీసులకు అందిన ఫిర్యాదులో ఉన్న తొమ్మిది మంది ఎబివిపి విద్యార్ధులు నజీబ్ అదృశ్యంతో తమకు సంబంధం ఉందన్న ఆరోణలను తిరస్కరిస్తున్నారు.
నజీబ్ అదృశ్యంలో బిజెపి నేతలు, దాని అనుబంధ ఏబివిపి కార్యకర్తల హస్తం ఉందనీ ఫాతిమా భావిస్తున్నారు. కానీ సిబిఐ మాత్రం అందుకు తగ్గ ఆధారాలు లేవనీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదనీ గత సంవత్సరం అక్టోబర్ 15 న కేసును మూసివేస్తూ కోర్టుకు నివేదికను ఇచ్చింది.
సిబిఐ రాజకీయ ఒత్తిడితోనే కేసును మూసివేసిందని ఫాతిమా ఆరోపించారు.