న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్ సభలో బీజేపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున ఈ బిల్లు సులభంగానే ఆమోదం పొందింది. అయితే, రాజ్యసభలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో, ఆర్టికల్ 370 రద్దు మాదిరిగానే.. పౌరసత్వ బిల్లును కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఆమోదింపజేసుకోవాలని బీజేపీ యోచినట్లు సమాచారం. ప్రస్తుతం ఎగువ సభలో బీజేపీకి 83 మంది సభ్యులు ఉన్నారు. ఎన్టీయే మిత్రపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది.
ప్రతిపక్షాల విమర్శలు, నిరసనల నడుమ ‘పౌరసత్వ (సవరణ) బిల్లు-2019’కు లోక్సభ సోమవారం(డిసెంబర్ 9) ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఏడు గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
అంతకు ముందు చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లో మతపరమైన దాడులకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లును రూపొందించామని చెప్పారు. రోహింగ్యా ముస్లింలను భారత్లోకి అనుమతించే ప్రసక్తే లేదని, వారంతా బంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్నారని పేర్కొన్నారు. ఈశాన్యరాష్ర్టాల ప్రజలు భయపడనవసరం లేదని, వారికి ఈ బిల్లు నుంచి తగిన మినహాయింపు ఉన్నదని అమిత్ షా పేర్కొన్నారు. ఈ బిల్లు నుంచి మణిపూర్ను మినహాయిస్తున్నట్టు చెప్పారు. ఇన్నర్ లైన్ పర్మిట్ కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్కు ఈ బిల్లు వర్తించదని చెప్పారు. త్రిపుర, మేఘాలయ, అసోంను ఈ బిల్లు నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ బిల్లును కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, బీజేడీ, వామపక్ష పార్టీలు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఐయూఎంఎల్ తదితర పార్టీలు వ్యతిరేకించగా… అకాలీదళ్, జేడీయూ, ఎన్డీడీపీ, ఎన్ఎఫ్ఎఫ్, మిజో నేషనల్ ఫ్రంట్, ఎల్జేపీ, వైసీపీ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి.
ఇదిఇలా ఉంటే.. ఈ బిల్లుకు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అయితే, కొన్ని పార్టీలు స్థానికంగా తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
మరోవైపు పౌరసత్వ సరవణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అస్సాంలోని ప్రజలు భిన్నరూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థి సంఘాల సంస్థ ‘ది నార్త్ ఈస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్’ మంగళవారం బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు 30 ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.