న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ బిల్లు ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదని అన్నారు. దేశంలోని మైనార్టీలకు 0.001 శాతం కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు బిల్లుకు సంబంధించి సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభ నుంచి ఏ పార్టీ కూడా వాకౌట్ చేయవద్దని కోరారు.
అంతకుముందు.. పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలోని మైనార్టీలను టార్గెట్ చేశారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్ కే ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ మతం ఆధారంగా పౌరసత్వ హక్కును కల్పించడం దేశ లౌకికవాద వ్యవస్థకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ బిల్లు భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న రాజ్యాంగ నిర్మాణ లక్షణాలను ఉల్లంఘిస్తోందన్నారు.
ఇక ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. హోం మంత్రి అమిత్ షా నుంచి ఈ దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. హిట్లర్ తరహాలో అమిత్ షా కూడా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన ఓవైసీ.. పౌరసత్వ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు.
మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించాలంటూ తమ ఎంపీలకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది. అయితే, ఎన్డీఏ మిత్ర పక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు తమకు మద్దతు తెలుపుతాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇప్పటీకే పార్టీ విప్ జారీ చేసింది.
ఈశాన్య రాష్ట్రాలలో అధికసంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. 1985 నాటి అసోం ఒప్పందంలో పేర్కొన్న నియమ నిబంధనలను ఈ బిల్లు కాలరాస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ప్రాంత విద్యార్థి సంఘం ఈ నెల 10న 11 గంటల బంద్కు పిలుపునిచ్చింది.