చిలకలూరిపేట: చంద్రబాబు అధికారాల్లేని ముఖ్యమంత్రి అని మాట్లాడటం ద్వారా సీఎస్ రాజ్యంగయేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికారాలు లేని ముఖ్యమంత్రి అనటం పట్ల సీఎస్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారాలు లేవని సీఎస్ ఏ విధంగా మాట్లాడతారని పుల్లారావు ప్రశ్నించారు. ‘చీఫ్ సెక్రటరీని నియమించింది ఎన్నికల సంఘమే. చీఫ్ సెక్రటరీ కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పని చేయాలి’ అని పుల్లారావు అన్నారు.
సీఎస్ ఒక రాజకీయ పార్టీకి పక్షపాతిగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోందని పుల్లారావు విమర్శించారు. సీఎస్ కుట్ర రాజకీయాల్లో భాగస్వామి అవుతున్నారని రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతుంది పుల్లారావు అన్నారు. నిన్న సీఈవో సమీక్ష నిర్వహించినట్టు లేదు. సీఎస్ సమీక్ష నిర్వహించినట్టు ఉందని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు. వైసిపి ఫిర్యాదు చేస్తే నిజాయితీ కలిగిన చీఫ్ సెక్రటరీ పునేఠాను బదిలీ చేశారని మంత్రి ప్రత్తిపాటి అన్నారు.
మోదీ, అమీత్షా కుట్రలో భాగంగానే పునేఠాను బదిలీ చేశారని మంత్రి పుల్లారావు ఆరోపించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీపై ఉంటుందని పుల్లారావు
అన్నారు. కేబినెట్ తీసుకున్న అధికారాలను ప్రశ్నించే అధికారం సీఎస్కు లేదని మంత్రి పుల్లారావు స్పష్టం చేశారు. పసుపు-కుంకుమ, పింఛన్లు, అన్నదాత సుఖీభావ పథకాలను అడ్డుకోవడానికి సీఎస్కు అధికారాలు లేవని పుల్లారావు అన్నారు.
సీఎస్ పరిధి దాటి ప్రవర్తిస్తే మే 23 తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని మంత్రి పుల్లారావు అన్నారు. ఎలక్షన్లో చంద్రబాబు పక్షాన రాష్ట్ర ప్రజలు నిలబడ్డారని పుల్లారావు చెప్పారు.
ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకోని అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని మంత్రి పుల్లారావు విమర్శించారు. మోదీ, కెసిఆర్లు సమీక్షలు నిర్వహిస్తే ప్రశ్నించరు కానీ చంద్రబాబు సమీక్షాలు నిర్వహిస్తే ప్రశ్నిస్తున్నారని పుల్లారావు అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనత మోదీకే దక్కుతుందని మంత్రి పుల్లారావు విమర్శించారు. మీలాగా దోచుకోవాలి…దాచుకోవాలి అనే వ్యక్తి చంద్రబాబు కాదని మంత్రి ప్రత్తిపాటి అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను కాపాడటంలో టిడిపి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు. దేశ ప్రజలను మోడీ నమ్మించి మోసం చేశారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.