విజయవాడ: టిడిపి నేతలపై ఐటి దాడులను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో ఆందోళనకు దిగారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రచారం చేయవల్సిన మేము మోది రాక్షస పాలన వల్ల నిరసన తెలియజేసేందుకు వచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని అడిగినందుకు కేంద్రం ఎదురుదాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోది చర్యలను ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్ బిజెపికి మద్దతు ఇస్తున్నారనీ, ఈ విషయం స్వయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారనీ చంద్రబాబు అన్నారు. నిన్న, మొన్న కూడా తన సభలో ప్రధానిగా మోదినే శాశ్వతంగా ఉంటారని జగన్ పొగుడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
జగన్ లోటస్ పాండ్లో ఉండి కుట్రలు, కుతంత్రాలకు పధకం రచిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోదికి పతనం ప్రారంభమైందనీ, అందుకే ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు.
రాక్షసపాలనకు మోది శ్రీకారం చుట్టారనీ, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనీ, ప్రశ్నిస్తున్నవారిపై ఐటి దాడులు చేయిస్తున్నారనీ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఖబడ్దార్ అంటూ ఆయన హెచ్చరించారు.
బిజెపి అగ్రనేత అడ్వాణీ చెప్పిన దానికి ప్రధాని మోది పూర్తిగా వ్యతిరేకమని చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని నాశనం చేయాలని మోది కంకణం కట్టుకున్నారనీ, అధికారం ఉంటే మోది ఎలాంటి దారుణాలైనా చేస్తాడనీ చంద్రబాబు ఆరోపించారు.
మోది భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. యుపిలో అఖిలేశ్, మాయావతి, కర్ణాటకలో కుమారస్వామి, తమిళనాడులో డిఎంకె నేతలపై ఐటి దాడులతో బిజెపి అపఖ్యాతి పాలయిందని ఆయన అన్నారు. బిజెపి చర్యలను ప్రజల్లో ఎండగట్టి వారిని చరిత్ర హీనులుగా నిలబెడతామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా మోది దుశ్చర్యలను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.