రాజమండ్రి: మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా తొలి పోలీస్ స్టేషన్ ను నేడు జగన్ ప్రారంభించారు. ఒక్కో స్టేషన్లో ఒక డిఎస్పీ ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే.