(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. సోమవారం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. పదిహేను వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని, ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించిందని సీఎం జగన్ చెప్పారు. 2030 నాటికి దేశానికి మూడువేల కోట్ల టన్నుల ఉక్కు అవసరం అవుతుందన్నారు. స్టీల్ ప్లాంట్కు అవసరమైన ఐరెన్ ఓర్ కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో 25 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నామని వెల్లడించారు. ఉక్కు పరిశ్రమతో ఈ ప్రాంత ప్రజల బతుకులు మారిపోతాయని అన్నారు.
ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలంలోనే స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశానని చెప్పారు. చంద్రబాబులోని మోసపూరిత గుణాన్ని, తనలో ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని, వైఎస్ఆర్ ప్రభుత్వం, ప్లాంట్ కు కావాల్సిన నీరు, ముడి ఇనుము తదితర అన్ని సౌకర్యాల కల్పనకూ సంబంధిత విభాగాలు, కంపెనీల నుంచి అనుమతులు తెచ్చిందని వివరించారు.