అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్… రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టారు. వీటి అమలుపై ఎప్పటికప్పుడు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్… క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు ఏ రకంగా ఉన్నాయి ? పథకాల అమలు తీరు ఏ రకంగా జరుగుతుంది ? అనే అంశాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రామస్థాయిలో రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశం. అయితే ఈ కార్యక్రమానికి రచ్చబండ అనే పేరునే ఖరారు చేస్తారా ? లేక మరేదైనా పేరు పెడతారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి… చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టాలని భావించారు. ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తాజా కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.