అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ కూడా ఖరారు అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు మొత్తం సీఎం జగన్ ఢిల్లీలోనే గడపనున్నట్లు సమాచారం. ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రస్తుతం ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. ఈ నెల 20న మూడు రాజధానుల అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందేలా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రాజధాని తరలింపు ప్రతిపాదనను టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి గ్రామాల్లో నెలరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఏపీ బీజేపీ శాఖ సైతం అమరావతికి మద్దతుగా తీర్మానం చేసింది. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో సమావేశం అయ్యారు. ఏపీలో రాజధానితో సహా అన్ని అంశాల్లో బీజేపీ- జనసేన కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించాయి. ఏపీలో బీజేపీ పవన్ను దగ్గరకు తీయడంతో కొత్త సమీకరణాలకు తెరలేసింది. దీంతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు.
అయితే, రాజధాని విషయంలో మాత్రం జగన్ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్లాలని భావిస్తున్నారు. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రతిపక్షాల తప్పుబడుతుండటంతో తన ఆలోచనల వెనక ఉద్దేశాలను నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రికి వివరించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గతనెలలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లినా.. పార్లమెంటు సమావేశాలు, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో మోదీ, అమిత్ షా ఇద్దరూ బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు. దీంతో వారి అపాయింట్ మెంట్ కుడా జగన్ కు దొరకలేదు. అయితే, తాజాగా ఇద్దరి అపాయింట్మెంట్ కూడా ఖరారు కావడంతో ఆయన హస్తినకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజలు సైతం జగన్ ఢిల్లీ యాత్రవైపు ఆసక్తిగా చూస్తున్నారు.