విజయవాడ: మహారాష్ట్ర రాజకీయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జ్యోతిబా పూలే వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. తాజా రాజకీయాలపై మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ మంత్రి వర్గంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టామన్నారు. ఆ పదవుల్లో కూడా బడుగు, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్గా తాము భావిస్తున్నామని.. అందుకే అన్ని పదవుల్లో వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
నిరుపేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకోవాలని, అన్ని రంగాలలో ఎదగాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారని.. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం వల్ల సంస్కృతి పోతుందనడం సరికాదన్నారు. ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న వారి పిల్లలు మాత్రం చక్కగా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారని.. కేవలం పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే సంస్కృతి పోతుందా అని సీఎం ప్రశ్నించారు. పేద విద్యార్థుల చదువు కోసం ఎంత ఖర్చయినా భరిస్తామని సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు పోతూ పోతూ ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టిపోయారని, రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అయినా వెనకడుగు వేయలేదన్నారు. దేవుడిపై నమ్మకంతో సంక్షేమపథకాలు అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు.