అమరావతి: చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాలెంలో తీవ్ర కలకలం రేపిన ఆరేళ్ల చిన్నారి వర్షిణి హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. వర్షిణిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కిరాతకుడిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులకు సీఎం ఆదేశించారు. ఆ దుర్మార్గుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని సూచించారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి వర్షిణి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. చిన్నారిని హత్య చేసిన దుండగుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు దుండగుడిని కర్ణాటక వాసిగా అనుమానిస్తున్నారు. వర్షిణి పోస్టుమార్టం రిపోర్టు పోలీసు అధికారులకు అందింది. చిన్నారిపై అత్యాచారం జరిగిందని, ఆపై ఊపిరాడకుండా చేసి, చంపేశారని వైద్యులు పేర్కొన్నారు.
చిన్నారి వర్షిణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వర్షిణి తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి.
నవంబర్ 8న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లో ఉన్న కళ్యాణ మండపం వద్ద అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి వర్షిణి ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కళ్యాణమండపంలోని సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించారు. వివాహ కార్యక్రమంలో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుసరించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. స్నేహితులతో ఆడుకుంటున్న చిన్నారిని గమనిస్తూ ఆ వ్యక్తి ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది. సదరు చిన్నారితో మాట్లాడుతున్న దృశ్యాలు కనపించాయి. ఎవరో పిలవడంతో కల్యాణ మండపంలోకి వర్షిణి పరుగులు తీసింది. ఆ తర్వాతే వర్షిణి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు.