(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు మానవత్వం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం సిఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకూ సభను ముందుకు సాగడానికి వీలులేదని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ జోక్యం చేసుకొని చంద్రబాబు నుండి క్షమాపణ వస్తుందని ఎవరూ అనుకోవడం లేదన్నారు. సభా సమయాన్ని చంద్రబాబు వృధా చేస్తున్నారని అన్నారు. ఆ జివోలో ఎటువంటి తప్పులు లేకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. వారిలో ఏ మాత్రం మానవత్వం లేదు కాబట్టి వారిని రెస్పెక్ట్ చేయాల్సిన పని లేదని జగన్ అన్నారు. చంద్రబాబు చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉన్నారు, వారు ఎవరినీ దగ్గరకు రానివ్వరు, అటువంటి కమాండోస్ను పెట్టుకొని మార్షల్స్పై ఈయన దౌర్జన్యం చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడి తనపైనే మార్షల్స్ దౌర్జన్యం చేశారంటూ అసత్య ఆరోపణలు చేయడం బాధనిపిస్తోందని జగన్ అన్నారు. అక్కడ జరిగింది అంతా సిసి కెమెరాలో రికార్డు అయ్యే ఉందన్నారు. జరిగిన దానికి చంద్రబాబు క్షమాపణ చెప్పేరకం కాదని ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని పేర్కొంటూ సభను కొనసాగించాల్సిందిగా స్పీకర్ను కోరారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ శాసనసభ వెలుపల, లోపల జరిగిన పరిణామాలకు సంబంధించిన వివరాలు తెప్పించుకొని పరిశీలించిన తరువాత వాస్తవాలను ఆధారంగా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. క్షమాపణ చెపుతారో చెప్పలో ఆయన (చంద్రబాబు) విజ్ఞతకే వదిలివేస్తామన్నారు. సభ్యుడు అనం రామనారాయణరెడ్డి సూచనలను పరిగణలోకి తీసుకుని జరిగిన విషయాలను పరిశీలించి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని స్పీకర్ అన్నారు.