(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఉల్లి ధరలపై శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చ అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. టిడిపి డిమాండ్తో స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం కల్పించారు. ఉల్లి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను టిడిపి సభ్యులు ఏకరువు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉల్లి పంపిణీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ వైసిపి సభ్యులు ప్రసంగించారు. గుడివాడ రైతుబజారులో రిటైర్డ్ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందితే దాన్ని టిడిపి రాజకీయం చేస్తున్నదని అధికార పక్షం విమర్శించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వివిధ ప్రాంతాల నుండి ఉల్లి కొనుగోలు చేసి రైతుబజారులో కేజీ 25 రూపాయల చొప్పునే అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం తక్కువ ధరకు ఉల్లిని రైతుబజారులో ఇస్తుండటం వల్లనే ప్రజలు బారులు తీరుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ స్టాల్స్లో కేజీ ఉల్లి 200ల రూపాయలకు విక్రయిస్తుంటే ప్రభుత్వం 25 రూపాయలకే అందిస్తోందని అన్నారు. శవాలపై రాజకీయం చేయడం టిడిపికి అలవాటేననీ జగన్ విమర్శించారు.
దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ ప్యూచర్ గ్రూపులో విక్రయాలు చేస్తుంటే తనదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, దీనిపై సిఎం జగన్ ఛాలెంజ్ విసురుతున్నాననీ, ఆ స్టాల్ తమని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేసి తప్పుకుంటాననీ, లేదంటే ముఖ్యమంత్రి తప్పుకుంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఛాలెంజ్ను జగన్ స్వీకరించాలన్నారు. తాను నిన్నటి సమావేశంలోనే ఈ విషయంపై ఖండించానని చంద్రబాబు గుర్తు చేశారు. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ గుడివాడలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందితే ఉల్లి కోసం వెళ్లి రైతుబజారులో వృద్ధుడు మృతి చెందాడంటూ టిడిపి సభ్యులు అసెంబ్లీలో తప్పుడు ప్రచారం చేస్తూ ఫోటోలు ప్రదర్శించారనీ, దీనిపై వారి కుటుంబ సభ్యులను అసెంబ్లీకి తీసుకువచ్చి ఉల్లిపాయల కోసం ఆయన వెళ్లలేదని చెప్పిస్తా, రాజీనామా చేస్తారా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
మంత్రి బుగ్గన మాట్లాడుతూ భారతదేశంలో హెరిటేజ్ సంస్థ ఎవరితో అందరికీ తెలుసునన్నారు. హెరిటేజ్ సంస్థకు సంబంధించి బిజినెస్ స్టాండర్డ్లో ప్రచురించి కథనాన్ని ఆయన చదవి వినిపించారు. చంద్రబాబు ఈ విషయంపై అంతగా ఆవేశపడి మాట్లాడే అవసరమేలేదని బుగ్గన అన్నారు. ఈ విషయంపై అధికార విపక్ష సభ్యుల గందరగోళ పరిస్థితి కొనసాగుతుండగానే స్పీకర్ రైతు భరోసా అంశంపై చర్చకు స్పీకర్ అవకాశం కల్పించారు.