హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ అంశంపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కోసం ప్రభుత్వం తరఫున వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. అయితే, ఆర్టీసీని బతికించుకోవడానికి చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించారు. కిలోమీటర్కు 20 పైసలు చొప్పును పెంచితే.. ఆర్టీసీకి ఏడాదికి రూ.750 కోట్లు ఆదాయం లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. దీని వల్ల సంస్థకు కొంత నష్టం పూడుతుందని చెప్పారు. చార్జీల పెంపు వచ్చే సోమవారం నుంచి అమలవుతుందని వెల్లడించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరితే ఎలాంటి షరతులు విధించమని స్పష్టం చేశారు. ప్రైవేట్ పర్మిట్లు కూడా ఆర్టీసీ వాళ్లకే ఇద్దామనుకున్నామని, ప్రగతిభవన్కు త్వరలో కార్మికులను పిలుస్తామన్నారు. మంచి చెడులు తానే అడిగి తెలుసుకుంటానని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట నమ్మి పెడదారి పట్టారన్నారు. విపక్షాలు కార్మికులకు లేని ఆశలు కల్పించారని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగుల..ఆర్టీసీ సమ్మె విషయంలో హంగామా సృష్టించారన్నారు. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు మాకు ఇంకా సమయం ఇచ్చిందన్నారు. ప్రతిపక్షాల పాలన ఉన్న రాష్ట్రాలలో ఎక్కడా ఆర్టీసీ ప్రభుత్వంలో వీలినం కాలేదన్నారు. ప్రతిపక్షాల నేతల వల్లే ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రకటనతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది. దీంతో వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలకు ఊరట లభించినట్లయింది.