హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కథ ముగియనుందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె అర్థరహిత, బుద్ది జ్ఞానం లేని సమ్మె అని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు ఇవ్వనంతగా ఆర్టీసీ కార్మికులకు తాము ప్రోత్సహకాలు ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో 67 శాతం జీతాలు కార్మికులకు పెరిగాయని వివరించారు. భారతదేశ ఆర్టీసీ చరిత్రలో కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఇంత శాతం జీతాలు పెంచిన చరిత్ర ఉందా? ఆ ప్రకారం కార్మికులకు జీతాలు రాలేదా? అని ప్రశ్నించారు. ఇంత చేసిన తర్వాత కూడా ‘ఇంకా మేము గొంతెమ్మ కోరికలు కోరతామంటే, అర్థముందా? అని ప్రశ్నించారు. ఎవరుబడితే వాళ్లొచ్చి తమను ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారని, అలా చేస్తామా? అది అంత తేలికా? అని సీఎం మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లు ఉన్నాయని, ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మిగిలిన కార్పొరేషన్ల వాళ్లూ ఇదే బాట పడితే ఏం సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమన్న అసంబద్ధమైన, అర్థరహితమైన, అసంభవమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారని, ఆర్టీసీ కార్మికులు పిచ్చి పంథాను ఎన్నుకున్నారని విమర్శించారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్ మండిపడ్డారు. సంస్థ పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, గతంలో తాను మూడు సంవత్సరాలు రవాణా శాఖ మంత్రిగా పనిచేశానని కేసీఆర్ తెలిపారు. ఆ రోజు ఆర్టీసీ సంస్థ పదమూడు కోట్ల ఎనభై లక్షల నష్టంలో ఉందని, తాను ఎంతో ఆలోచన చేసి సంస్థను లాభాల బాటపట్టేలా చేసి దాన్ని కాపాడానని గుర్తు చేశారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.3 కోట్లు నష్టం వస్తోందని, ప్రైవేట్ బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు.
ఆర్టీసీని యూనియన్లే కార్మికులను తప్పుదోవ పట్టించి వాళ్లను సమ్మె బాట పట్టించారని సీఎం చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని.. జీతాలు ఇవ్వడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బు లేదని తెలిపారు. ఇప్పటిదాకా ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.900కోట్లు ఇస్తూ వచ్చిందని.. ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు కూడా లేదన్నారు. ఆర్టీసీ ఒక్కటే తమ ప్రాధాన్యం కాదని.. మిగతా కార్పోరేషన్లను కూడా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం తెలిపారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మి వారికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. యూనియన్లు అనసవరంగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.