హైదరాబాద్: మున్సిపల్ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందన్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనకు మంచి తీర్పు ఇచ్చారని అన్నారు. తాము అనుసరిస్తున్న పద్దతి ప్రజలకు నచ్చిందన్నారు. అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఏకపక్ష గెలుపు ఆనవాయితీగా మారిందని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అద్భుతమైన విజయం వచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు వచ్చాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష గెలుపు ఆలిండియా రికార్డ్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన ఆశీస్సులు అని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల చెంప చెళ్లుమనిపించారని పేర్కొన్నారు.
తన అనుభవంలో అనేక మున్సిపల్ ఎన్నికలు చూశానని, కానీ ఈ తరహా విజయాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. 1994లో తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీరామారావుతో కలిసి తిరిగానని, తాము మద్య నిషేధం ప్రకటించామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రజలు తమను బ్రహ్మాండంగా గెలిపించారని వెల్లడించారు. అయితే మద్య నిషేధం కారణంగా ప్రభుత్వంపై కొన్నివేల కోట్ల భారం పడిందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో సేల్స్ ట్యాక్స్ పెంచాల్సి వచ్చిందని, ఆపై జరిగిన ఎన్నికల్లో మద్యనిషేధం సంగతి మర్చిపోయిన ప్రజలు సేల్స్ ట్యాక్స్ ను దృష్టిలో పెట్టుకుని తమను ఓడించారని కేసీఆర్ వివరించారు. రాజీవ్ గాంధీ మరణం సమయంలోనూ ఘనవిజయం సాధించిన తాను, సేల్స్ ట్యాక్స్ దెబ్బకు సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.
తాజా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేకుండా టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచారని ఫలితాలు చూస్తే అర్థమవుతుందని కేసీఆర్ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ఓటర్లు ఉంటారని, వారు కూడా ఈసారి ఏకపక్షంగా ఓట్లేశారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఇలా అన్ని ఎన్నికల్లోనూ తమకే పట్టం కట్టారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు జరగకుండా విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని కేసీఆర్ ఆరోపించారు. అలాంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయితే అభివృద్ధి పనులు కొనసాగించవచ్చని తాము భావిస్తే, ఎలాగైనా ఎన్నికలు ఆపాలని విపక్షాలు పనిచేశాయని మండిపడ్డారు. అనేక అవాంతరాలను అధిగమించి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో తీర్పు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష నాయకులు ఇష్టారీతిన మాట్లాడారని అన్నారు. హద్దు, అదుపు లేకుండా విలువలకు పాతరపెట్టి నోటికొచ్చినట్లు వ్యక్తిగత దూషణలకు దిగారని దుయ్యబట్టారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ఎంపీ.. ముఖ్యమంత్రి అనే కనీస మర్యాద లేకుండా ముక్కు కోస్తా అంటూ వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నించారు. జాతీయ పార్టీల పద్ధతి ఇదేనా అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో తాను ఏ ఒక్క అధికారితో మాట్లాడలేదన్నారు.