(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చేస్తారా? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే విషయాలపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ను కార్మికులు పట్టించుకోని నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. మిగతా సగాన్ని కూడా ప్రైవేటీకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10,200 ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూట్ మ్యాప్ను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. టికెటింగ్, టైమింగ్స్, రూట్స్.. వీటన్నింటిపై మార్గదర్శకాలు సిద్దమయ్యాయని సమాచారం. ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చినా సరే.. అవన్నీ ఆర్టీసీ కార్పోరేషన్ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
ఉద్యోగాల్లో చేరాలని తాను ఇచ్చిన గడువును కార్మికులు పట్టించుకోకపోవడంతో ఇక తనదైన దారిలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఇక కథ ముగిసినట్లే. ఆర్టీసీ ఇప్పుడున్న రూపంలో ఇక ఎంతమాత్రం కొనసాగదు. ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధపడుతోంది’’ అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్ తన వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే,ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. న్యాయ నిపుణులతో తాము సంప్రదింపులు జరిపామని.. ఆర్టీసీలో 31శాతం కేంద్రం వాటా ఉందని, కాబట్టి కేంద్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరించడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ గుండె ధైర్యం కోల్పోకుండా మనో నిబ్బరంగా ఉండాలని సూచిస్తున్నారు. రేపు హైకోర్టు విచారణ నేపథ్యంలో తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశిస్తుందన్న నమ్మకం ఉందంటున్నారు. కేసీఆర్ ఆర్టీసీ జేఏసీతో ఇప్పటికైనా చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇంకా కార్మికులను భయపెట్టే ధోరణితో వ్యవహరిస్తే వెనక్కి తగ్గేది లేదని.. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ విధించిన డెడ్ లైన్కు కార్మికుల నుంచి స్పందన కరువైందని.. ఒక్క శాతం కార్మికులు కూడా విధుల్లో చేరలేదని తెలిపారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతునిచ్చాయని చెప్పారు. అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలను కూడా ఒకరోజు పెన్ డౌన్ చేయాల్సిందిగా కోరుతామన్నారు.
అయితే, తాను ఇచ్చిన డెడ్లైన్ సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో సీఎం కేసీఆర్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. డెడ్లైన్లోగా విధుల్లో చేరకపోతే.. 6న మరో కీలక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన ఐదు వేల బస్సులకూ ప్రైవేటు పర్మిట్లు ఇచ్చేస్తామని హెచ్చరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్ తన వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన బస్సులకూ ప్రైవేటు పర్మిట్లు ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. హైకోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. సుప్రీం కోర్టుకు వెళతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.