హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ సమావేశం కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 50 శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె, 20 శాతం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లు ఉండాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రైవేటు స్టేజ్ కేరియర్లను అనుమతులు ఇవ్వవచ్చని ఇప్పటికే సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు అనుగుణంగా అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నాలుగు నుంచి ఐదు వేల రూట్లలో ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెట్విన్ సర్వీసుల సేవలు వినియోగించుకోవడం వంటి అంశాలను సర్కారు పరిశీలిస్తోంది. వీటితో పాటు మునిసిపల్ ఎన్నికలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు గత 27 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో కార్మికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో సకల జనభేరి పేరిట భారీ బహిరంగ సభకు నిర్వహించారు. ఈ సభకు విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ తీరుపై సభలో పాల్గొన్న విపక్ష పార్టీల నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చి పంథా అని, వారిది దురహంకార పద్ధతి అని సీఎం కేసీఆర్ ఇటీవల మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఆర్టీసీ సంస్థ ముగింపే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధ డిమాండ్ అన్నారు. ఆర్టీసీని స్వయంగా వారే ముంచుకుంటున్నారని ధ్వజమెత్తారు. యూనియన్ నేతలు కార్మికుల గొంతు కోస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాంటి పరిస్థితే ఆర్టీసీకి పడుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నవంబర్ రెండోవ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.