(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా, మహిళా, స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని.. వెంటనే ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఈ ఘటనపై నోరు మెదపలేదు. దీంతో విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కర్కశ హృదయుడని.. ప్రియాంక ఘటనపై ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక మంత్రులు మాట్లాడుతున్న తీరు అనుచితంగా ఉందని విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, తెలంగాణలో శాంతిభద్రతలు కొరవడ్డాయని ఆరోపలు గుప్పిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా సీఎం కేసీఆర్ కు లేదా ? అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిలదీశారు. ఘటనను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు.
మరోవైపు ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక కుటుంబ సభ్యులను కలవడానికి ఎవరూ రావొద్దని బంధువులు, కాలనీవాసులు నినాదాలు చేస్తున్నారు. ఇంటికి తాళాలు వేసి, ఎవర్నీ రానివ్వకుండా గేట్లు మూసివేశారు. ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, సీపీఎం నేత జూలకంటి బృందాన్ని గేటు ముందే కాలనీ వాసులు అడ్డుకున్నారు. పరామర్శలు వద్దని.. న్యాయం కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే ప్రకటన చేయాలని వారు నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన నాయకులు, స్థానికులు వెనుదిరిగారు. ప్రియాంకరెడ్డి ఘటనలో ప్రజల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. మరి సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందిస్తారా ? లేదా ? అన్నది చూడాలి.