హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుందని, కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా ఉండే ఓ సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
సమ్మెలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు వారం రోజుల్లోగా ఉద్యోగాలిచ్చి, రెండు లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లిస్తామని చెప్పారు. సంస్థ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంటు కల్పిస్తామని, అదేవిధంగా గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన చేస్తామని తెలిపారు. సంస్థ లాభాల బాటలో నడవాలంటే ఆర్టీసీలో పార్శిల్ సర్వీసులను కూడా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దని, రాత్రి 8 గంటలకు విధులు ముగిసేలా వారికి డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు.