(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనపై సీఎం ప్రస్తావించారు. వైద్యురాలి హత్య అతి దారుణమైన, అమానుష దుర్ఘటనగా అభివర్ణించారు. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దన్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం కోరారు. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.