హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్ ఉంటుందని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ తీర్మానించిందని వెల్లడించారు. శనివారం తెలంగాణ మంత్రివర్గం దాదాపు ఐదు గంటలకుపైగా సాగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెతో పాటు పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 49 అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగిందని చెప్పారు. ఆర్టీసీ సమస్యపై సుదీర్ఘంగా చర్చించామని, పండుగలు, పరీక్షల వంటి కీలక సమయాల్లో బెదిరింపులకు దిగుతూ, సమ్మెలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని నిర్ణయించామని తెలిపారు. సున్నితమైన సమయాల్లో సమ్మెలు చేయడం బ్లాక్ మెయిల్ తరహా పన్నాగాలు అని ఆరోపించారు. సమ్మెకు వెళ్లకూడదని ఆర్టీసీ కార్మికులకు చెప్పినా వినలేదని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అనాలోచితంగా, అర్ధరహితంగా సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దురహంకారంతో కార్మికులు సమ్మెకు పోయారన్నారు. కార్మికుల డిమాండ్లపై కూడా కేబినెట్లో వివరంగా చర్చించినట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకు నివేదిక ఇచ్చామని, చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులు, యజమాన్యానికి ఆటోమెటిక్గా సంబంధాలు తెగిపోతాయని కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని డిమాండ్లు పెట్టుకొని తలబిరుసుతో సమ్మెకు పోయారని సీఎం మండిపడ్డారు. ఎవరూ ఎవరినీ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదని, అందుకే ఆర్టీసీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉండాలని, ప్రైవేట్ కూడా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణలో ఆర్టీసీ పది వేల నాలుగు వందల బస్సులు నడుపోతోందని.. అందులో 2,100 బస్సులు ప్రైవేట్వేనని కేసీఆర్ తెలిపారు. మరో మూడు వేల బస్సులకు కాలం చెల్లిపోయిందన్నారు. కొత్తగా బస్సులు ఆర్టీసీ కొనలేదని…పూర్తిగా పనికిరాకుండా పాడైపోయిన బస్సుల స్థానాన్ని ఈ ప్రైవేటు బస్సులతో భర్తీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సమ్మె వల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం మైనస్లోకి వెళ్లిందన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు స్థానం కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని అన్నారు. అందుకే 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్ లో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలివి తక్కువ తనమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక వేళ ప్రభుత్వంలో విలీనం చేస్తే దుష్పరిణామాలు ఉంటాయన్నారు. ప్రైవేట్ రూట్లలో ఇష్టానుసారం చార్జీలు పెంచడానికి లేదని.. చార్జీల నియంత్రణ కమిటీ ఉంటుందన్నారు. బస్ పాసుల రాయితీలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. 49వేల మంది ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలనే భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అనవసరంగా బతుకులు ఆగం చేసుకోవద్దని.. మిమ్మల్ని అణచివేసే ఉద్దేశం లేదన్నారు. ‘యూనియన్ల మాయలో పడి భవిష్యత్ను ఆగం చేసుకోవద్దు. నవంబర్ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరండి. అలా చేరితేనే మీకు భవిష్యత్ ఉంటుంది. నిజానికి ఇప్పుడు సమ్మె చేస్తున్న కార్మికులకు ఆర్టీసీకి సంబంధం లేదు. చిరుద్యోగులను సానుభూతితో చూసిన చరిత్ర మాది. ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో 67 శాతం జీతాలు పెంచాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. అందరి కడుపులు నింపాం.. ఎవరి పొట్ట కొట్టే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణ భవిష్యత్ కోసమే ఆర్టీసీ నిర్ణయం’ అని సీఎం వ్యాఖ్యానించారు.